జియ్యమ్మవలస రూరల్: శ్మశానవాటిక ఆక్రమణకు గురికావడంతో ఓ దళిత వృద్ధురాలి మృతదేహాన్ని మార్గంమధ్యలో ఖననం చేసిన హృదయ విదారకమైన ఘటన జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 72 ఏళ్ల అనాథ వృద్ధురాలు అమ్మాజమ్మ ఈ నెల 27న (శుక్రవారం) మరణించారు. ఆమె శవాన్ని స్థానికులు ఊరికి 100 మీటర్లు దూరంలో ఆక్రమణకు గురైన శ్మశానవాటికకు తీసుకెళ్లలేక దారిలోనే పూడ్చిపెట్టారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ అక్కడి రైతులు తహసీల్దార్ ఎన్.అప్పారావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. శ్మశాన వాటిక సమస్యకు పరిష్కారం చూపుతానన్నారు.
ఇదీ పరిస్థితి...
తురకనాయుడువలస గ్రామానికి వంద మీటర్లు దూరంలో సుమారు 4 సెంట్లు శ్మశానవాటిక ఉంది. దీనిని అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. దీనిపై దళితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇటీవల పర్యటించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు కూడా సమస్యను వివరించారు. అయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలంలేక సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
దళితుల 4 సెంట్లు శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించిన అధికారపార్టీ కార్యకర్తలు
దారి మధ్యలో వృద్ధురాలి మృతదేహం ఖననం
తురకనాయుడువలసలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన


