రామభద్రపురం: జిల్లాలోని రూ.49 కోట్ల అంచనాలతో సీహెచ్సీ భవనాల నిర్మాణాల పనులతో పాటు ఆధునీకరణ పనులు, ఆయుష్ భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ నాగిరెడ్డి భారతి అన్నారు. స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఆయుష్ భవన నిర్మాణ పనులు శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఎస్.కోట, భోగాపురం, నెల్లిమర్ల, బాడంగి, గజపతినగరం తదితర ప్రాంతాలలో రూ.46.78 కోట్లతో సీహెచ్సీ భవనాలు నిర్మాణాలు జరగుతున్నాయన్నారు. వీటిలో పలు చోట్ల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది చోట్ల ఆయుష్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని పీహెచ్సీల ఆవరణలో నిర్మాణం చేపడుతున్న ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, వేరే ప్రాంతాలలో నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.30 లక్షలు చొప్పున్న నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు పరిశీలించి నాణ్యత ఉండేలా చూడాలని సంబంధిత డీఈ ప్రసన్నకుమార్కు సూచించారు.
ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ భారతి


