విజయనగరం మండలం దుప్పాడలో పని చేస్తున్న వేతనదారులు
విజయనగరం ఫోర్ట్:
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన వారికి సరిగా వేతనాలందక అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనికి వెళితే సకాలంలో వేతన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన వేతనదారులకు కోట్లాది రుపాయిలు వేతన బకాయిలు అందాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని చేపట్టారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఉపాధి హామీ లక్ష్యానికే తూట్లు పడుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనికి వెళ్లిన వారికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల వేతనదారులు మళ్లీ వలసబాట పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మళ్లీ వలసబాటేనా...
ఉపాధి హామీ పథకం రాక ముందు ఉపాధి కోసం జిల్లా నుంచి హైదరాబాద్, చైన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు జిల్లా ప్రజలు వలస వెళ్లేవారు. పొరుగు జిల్లా అయిన విశాఖపట్నం కూడా వెళ్లేవారు. నెలలు, సంవత్సరాలు తరబడి అక్కడే కూలీ, నాలీ చేసుకుని అక్కడే ఉండేవారు. ఉపాధి హామీ పథకం చేపట్టిన తర్వాత కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే చంద్రబాబు సర్కార్ వైఖరి వల్ల మళ్లీ వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి.
1.07 కోట్ల పని దినాలు తగ్గింపు
జిల్లాలో వేతనదారులు 6,26,094
జిల్లాలో జాబ్ కార్డులు 3.45 లక్షలు కాగా.. జిల్లాలో వేతనదారులు 6,26,094 మంది ఉన్నారు. జిల్లాలో అధికశాతం మంది వేతనదారులు నిరుపేదలే. గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులకు వెళ్లి వాటి ద్వారా వచ్చే వేతనంతో జీవిస్తారు. ఇటువంటి వారికి వేతనాలు సకాలంలో రాకపోవడం వల్ల వారి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో వారు కుటుంబ పోషణ కోసం వలస బాట పడుతున్నట్టు తెలుస్తుంది.
నాలుగు నెలలుగా అందని వేతనాలు
ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన వారికి నాలుగు నెలలుగా వేతనాలు అందని పరిస్థితి. 2025 నవంబర్ నెల నుంచి వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. పనికి వెళ్లినా నాలుగు నెలలుగా వేతనాలు అందక పోవడంతో వేతనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 10 లక్షల పని దినాలకు సంబంధించి రూ.30 కోట్లు వరకు బకాయిలు రావాల్సి ఉంది.
ఉపాధి హామీ వేతనదారులకు అందని వేతనాలు
నాలుగు నెలలుగా ఎదురుచూపులు
రూ.30 కోట్ల వరకు బకాయిలు
జిల్లాలో జాబ్ కార్డులు 3.45 లక్షలు
వేతనదారులు 6.26 లక్షలు
పథకం పేరు మార్పుతో వేతనాలపై అనుమానం
మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీ రామ్ జీగా ప్రస్తుతం ప్రభుత్వం మార్చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వీబీజీరాంజీ పథకంగా అమలు కానుంది. దీంతో 2025 సంవత్సరంలో వేతనదారులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు చెల్లింపులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత పథకంతో పని చేసినా వేతనాలు చెల్లిస్తారా.. లేదా.. అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వేతన బకాయిలు నిజమే..
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వేతనదారులకు గత ఏడాది నవంబర్ నెల నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. సుమారు రూ.30 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వేతనాలు నేరుగా వేతనదారుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. – ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ
2023 సంవత్సరానికీ... ఇప్పటకీ కోట్లాది పనిదినాలు తగ్గిపోయాయి. 2023 – 24 సంవత్సరానికి సంబంధించి 2.18 కోట్ల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.502.36 కోట్లు వెచ్చించారు. 2025 – 26సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 1.11 కోట్లు పనిదినాలు కల్పి ంచారు. ఇందుకుగాను రూ.242.64 కోట్లు వెచ్చించారు. 1.07 కోట్ల పనిదినాలు 2023–24 సంవత్సరం కంటే తక్కువగా పనిదినాలు కల్పించారు. పనిదినాలు తగ్గించడం వల్ల ఎంతో మంది వేతనదారులకు పని దొరకని పరిస్థితి. దీంతో వారికి ఉపాధి కూడా పోయింది. ఉపాధి వేతనదారుల సంక్షేమానికి పాటుపడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ మాటలకు.. చేతలకు పొంతన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


