విజయనగరం ఫోర్ట్: పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించాలని, అవుట్ పేషేంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను విస్తృతం చేయాలన్నారు. వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు నమ్మకం కలిగేలా పని చేయాలన్నారు. ప్రతి ిపీహెచ్సీలో నెలకు 1500 మందికి సేవలు అందించాల్సి ఉండగా చాలా పీహెచ్సీల్లో నెలకు 50 శాతం కూడా సేవలు అందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్సీడీ స్క్రీనింగ్ శతశాతం పూర్తి చేయాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సహకాలు గురించి ప్రచారం చేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రసవ తేదీకి ముందుగానే ఆస్పత్రిలో చేర్చాలన్నారు. డయేరియా కేసులు వస్తే వెంటనే ఎంపీడీఓకు సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో పశువుల మందుల విక్రయ కేంద్రాలు
విజయనగరం కలెక్టరేట్: రాష్ట్రంలో పశువైద్య సేవలను మరింత చేరువ చేస్తూ, పశుపోషకులకు నాణ్యమైన, చవకైన మందులను అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి పశు ఔషధి విక్రయ కేంద్రాల ద్వారా పశువుల మందులను అందించేందుకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ద్వారా జెనరిక్ మందులను సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, గ్రామ స్థాయిలో మహిళా సాధికారతను పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలుపై కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష, జిల్లా జంతు సంక్షేమ సంఘ సమావేశాలను నిర్వహించారు. జిల్లాలో జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతి నియోజకవర్గంలో రక్షించబడిన, నిరాశ్రయ జంతువుల కోసం యానిమల్ హాస్టల్స్ నిర్మించి, నిర్వహణను ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘కై ండ్నెస్ క్లబ్స్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ, జెడ్పీ సీఈఓ బివి.సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు, ఎఫ్ఆర్ఓ వివిఎస్ఎన్.రాజు, ఆర్టీఓ యు.దుర్గాప్రసాద్, డీఎస్పీసీఏ నోడల్ అధికారి డాక్టర్ ఎల్.విష్ణు, వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


