● జాతీయ స్థాయిలో 640 ర్యాంకు
విజయనగరం ఫోర్ట్: తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ యువకుడు నిలబెట్టాడు. రెండుసార్లు సాధించలేకపోయినా మూడో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించి తల్లిదండ్రులతో పాటు జిల్లాకే గుర్తింపు తీసుకొచ్చాడు. కొద్ది నెలల కిందట తల్లి మరణించినప్పటకీ ఆ దుఃఖాన్ని మనసులో దిగమింగుతూ పరీక్షలకు సిద్ధమై యూపీఎస్సీలో జాతీయ స్థాయిలో 640 ర్యాంకు సాధించాడు పట్టణంలోని కామాక్షినగర్లో నివాసం ఉంటున్న పల్లి ప్రమోద్ విష్ణు. విష్ణు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విజయనగరంలోని సెయింట్జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివాడు. 6నుంచి 8వ తరగతి వరకు విజయనగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివాడు. 9, 10 తరగతులు విజయవాడలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ విజయవాడలోని గోశాల వద్ద చైనా బ్యాచ్ కళాశాలలో చదివాడు. ఢీల్లీలోని ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ చదివాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎయిర్ఫోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారిగా పని చేస్తున్నారు. విష్ణు తల్లిదండ్రులు స్వస్థలం గంట్యాడ మండలం కొర్లాం గ్రామం. తండ్రి పల్లిశ్రీనివాస్ గొట్లాం హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి లత గంట్యాడ మండలంలోని కొఠారుబిల్లి ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయరాలుగా పని చేసేవారు. అనారోగ్యంతో కొద్ది నెలలు క్రితం మరణించారు. ప్రమోద్విష్ణు యూపీఎస్సీలో మూడో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాడు. ఈయనకు ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని తండ్రి పల్లి శ్రీనివాసరావు తెలిపారు. విష్ణును కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందించారు. ఇదిలా ఉండగా విష్ణు సొంత గ్రామం కొర్లాంలో సందడి నెలకొంది. విష్ణు తన ప్రతిభతో గ్రామానికే కాక జిల్లాకే గర్వకారణంగా నిలిచాడని పలువురు అభినందించారు.


