సీతంపేట: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలకు నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు అన్నారు. జీసీసీ ద్వారా నిర్వహించే టెండర్ల ప్రక్రియలో నాణ్యమైన శాంపిల్స్ చూపించి సరఫరాలో మాత్రం కొందరు చేతివాటం చూపిస్తున్నారని అన్నారు. ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిత్యవసర సరుకుల పంపిణీకి (కంది, వేరుశనగ, ఇడ్లీనూక, మినపగుళ్లు, నూనెలు) శుక్రవారం టెండర్లు నిర్వహించారు. మొత్తం 26 సరుకుల సరఫరాకు 12 మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ.. పలు ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలు సందర్శించినప్పుడు నాణ్యత లేని సరుకులు కనిపించాయన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న సరుకులు అందించకపోతే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం దాసరి కృష్ణ, మేనేజర్ గొర్లె నరసింహులు, హెచ్డబ్ల్యూఓలు పాలక అమల, హెచ్.శారద, పి.రాజారావు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు


