● ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
సదస్సులో బ్యాంక్ అధికారులు
విజయనగరం అర్బన్: బ్యాంకింగ్ సేవల్లో మోసాలపై ఖాతాదారులు చైతన్యం కావాలని ఆర్బీఐ మేనేజర్ ఎ.రామకృష్ణ అన్నారు. భారతీయ రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు స్థానిక ప్రైవేటు హాటల్లో ఐటీఐ, కళాశాల విద్యార్థులు, బ్యాంక్ల నూతన ఖాతాదారులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిఽథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్బీఐ అధికారులు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ భద్రత, బీమా పథకాలపై విస్తృ తంగా అవగాహన కల్పించారు. కేవైసీ ప్రక్రియ ప్రాముఖ్యత, బ్యాంకు ఖాతాలలో నామినేషన్ అవసరం, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందే విధానాలపై అధికారులు వివరించారు. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్ల లక్షణాలు, నకిలీ నోట్లను గుర్తించే పద్ధతుల గురించి కూడా తెలియజేశారు. బీమా మరియు పొదుపు పథకాలైన పీఎంజేజేబీవై, అటల్ పెన్షన్ యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ప్రయోజనాలపై కూడా పాల్గొనే వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు, స్పామ్ మెసేజీలు, ఓటీపీ/డేటాషేరింగ్, అనుమానాస్పద లింక్ల ద్వారా జరిగే సైబర్ మోసాల గురించి కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వీవీ రమణమూర్తి, నాబార్డ్ డీఓఎం టి.నాగార్జున, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జిజేంద్ర శర్మ, మెప్మా పీడీ జి.యు.చిట్టిరాజు, ఆర్సెట్ డైరెక్టర్ డి.భాస్కరరావు, సైబర్ క్రైమ్ ఎస్ఐ ప్రసన్నకుమార్, ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ ఎం.సురేష్ బాబు, ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీ గిరి, బ్యాంకు అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు.


