● విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
● ఏపీటీఎఫ్ (1938) డిమాండ్
విజయనగరం గంటస్తంభం: విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్–1938) ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకత్వం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం, 30 శాతం ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ బకాయిలు చెల్లించడం అత్యవసరమని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం.57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయడం, హైస్కూల్ ప్లస్ ఖాళీల భర్తీ, కారుణ్య నియామాకాలు చేపట్టడం, జీవో 342 ప్రకారం ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత విద్యాభ్యాసానికి అనుమతులు ఇవ్వడం, ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


