● వెనక్కి మళ్లిన రూ.54లక్షల నిధులు
విజయగనరం ఫోర్ట్:
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైంది వైద్యాధికారుల పరిస్థితి. నిధులు లేక కొన్ని శాఖలు ఏ కార్యక్రమాలు చేపట్టకపోగా.. నిధులున్నా ఖర్చుచేయడంలో వైద్యశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పథకం కింద మంజూరైన రూ.54లక్షల నిధులు వెనుకకు వెళ్లిపోవడంపై వైద్యవర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పథకాలకు నిధులు విడుదల
ఎస్ఎన్సీయూ (నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం), ఎన్ఆర్సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం), జేఎస్ఎస్కే (జననీ శిశు సురక్ష కార్యక్రమం), జేఎస్వై (జననీ సురక్ష యోజన), ఎన్ఆర్సీపీ (నేషనల్ రేబీస్ కంట్రోల్ ప్రొగ్రాం), రక్తసేకరణ, రవాణ వాహనానికి వినియోగించేందుకు ఎన్హెచ్ఎం కింద నిధులు విడుదలవుతాయి. 2024–25 సంవత్సరానికి సంబంధించి జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి కార్యాలయం (డీసీహెచ్ఎస్)కు రూ.54 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఆ నిధులు సకాలంలో ఖర్చు చేయక పోవడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయి.
● ప్రయోజనం కల్పనలో విఫలం
జేఎస్వై నిధులను ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు మందులు, ఆహారం, రవాణ సౌకర్యం, రక్తం వంటి వాటికి వినియోగిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.600, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారికి రూ.1000 చొప్పున ఇస్తారు. ఎస్ఎన్సీయూకు కేటాయించిన నిధులను అక్కడ చికిత్స పొందే నవజాతి శిశువులకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ఎన్ఆర్సీ నిధులను పౌష్టికాహార లోపంతో ఉండే పిల్లల చికిత్సకు, పౌష్టికాహారానికి వెచ్చించాలి. ఎన్ఆర్సీపీ నిధులను కుక్కకాటుకు గురైన వారికి ఇచ్చే రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక గది, అందులో సౌకర్యాల కల్పనకు వినియోగించాలి. కేటాయింపుల్లో నిర్లక్ష్యంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
రక్తసేకరణ, రవాణ వాహనం
ఖర్చుచేయలేదు..
2024–25 సంవత్సరానికి సంబంధించి డీసీహెచ్ఎస్కు రూ.54 లక్షలు నిధులు ఎన్హెచ్ఎం కింద విడుదలయ్యాయి. వాటిని ఖర్చు చేయక పోవడం వల్ల వెనక్కి వెళ్లి పోయాయి.
– కె.అరుణ్, ఎన్హెచ్ఎం ఏఓ


