విజయనగరం టౌన్: కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం 3.19 నుంచి సాయంత్రం 6.46 గంటల వరకు పైడితల్లి అమ్మవారి చదురుగుడి, వనంగుడిలో అర్చనలు, దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం యథాతథంగా కల్పిస్తామన్నారు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉదయం 9.30 గంటలకే రామతీర్థం ఆలయం మూసివేత
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి దేవస్థానాన్ని మంగళవారం మూసివేస్తున్నామని ఈఓ వై.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రోజంతా మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.21 నుంచి సాయంత్రం 6.42 గంటల వరుకు గ్రహణం పడుతుందని ఈ కారణంగా ఉదయం 9.30 గంటలకే ఆలయ తలుపులు మూసివేస్తామన్నారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజలు జరిపిస్తామన్నారు. బుధవారం నుంచి యథావిధిగా దర్శనాలు ఉంటాయని, భక్తులు గమనించాలని కోరారు.
తోటపల్లి కాలువలో పూడికలు
తెర్లాం: మండల పరిధిలోని తోటపల్లి కుడి ప్రధాన కాలువలో పూడికతీత పనులకు రూ.5కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ప్రాజెక్టు డీఈ సుబ్బారావు, ఏఈ రఘు తెలిపారు. తోటపల్లి కాలువను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాలువల్లో పూడిక తీసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


