డోలోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
● ఈ నెల 5 నుంచి ఏడు వరకు గుళ్ల
సీతారాంపురంలో ఉత్సవాలు
● సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర
సంతకవిటి: మండలంలోని గుళ్ల సీతారాంపురంలో వెలిసిన సీతారాముల ఆలయంలో ఈ నెల 5 నుంచి ఏడో తేదీ వరకు డోలోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఈఓ మాధవరావు తెలిపారు. వాస్తవానికి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి డోలోత్సవాలు నిర్వహించాల్సి ఉన్నా.. గ్రహణం సంభవిస్తుండడంతో ఉత్సవాలను ఐదో తేదీ నుంచి ఏడు వరకు నిర్వహించనున్నారు. అయితే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారిని ఆంజనేయ, సర్ప వాహనాలపై ఉత్తరముఖ మంటపానికి తీసుకువచ్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయశాఖాధికారులు, గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు.
500 ఏళ్ల చరిత్ర
గుళ్లసీతారాంపురంలో వెలిసిన సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం ఆనాడు ఈ ప్రదేశం నిర్మానుష్యంగా అడవితో ఉండేది. బొబ్బిలి రాజులు వేటకై ఈ ప్రదేశానికి వచ్చి సేద దీరే సమయంలో సీతారాములు కలలో కనిపించి, తాము ఇక్కడ వెలిశామని, ఆలయం నిర్మించాలని అనుగ్రహించారు. దీంతో బొబ్బిలి రాజులు వెంటనే అతిసుందరమైన సీతారాముల ఆలయంతో పాటు గ్రామాన్ని కూడా నిర్మించి సీతారాంపురంగా నామకరణం చేశారు. అయితే సీతారాంపురం గ్రామాలు ఎక్కువగా ఉండడంతో ఈ గ్రామం గుడి సీతారాంపురంగా.. కాలక్రమంలో గుళ్లసీతారాంపురంగా పేరుగాంచింది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం రాళ్ల పేరుతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాదాపు 65 అడుగుల ఎత్తు గల గాలిగోపురం ఉంది. గాలి గోపురం పైకి ఎక్కి చూస్తే బొబ్బిలిలోని వేణుగోపాలుని ఆలయం కనిపిస్తుందని ప్రాశస్త్యం. ఇక్కడ సీతారాములు ఏకశిలపై ఉండడం విశేషం. ఏ ఆలయంలో అయినా సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. కాని ఈ ఆలయంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు, ధనుర్బాణాలు, శంఖుచక్రాలు ఉండక పోవడం విశేషం. గోడలపై చెక్కిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ప్రధాన ఆలయం చుట్టూ ప్రత్యేక బేడా మంటపం ఏర్పాటు చేశారు. ఈ బేడాను ఆనుకుని అళ్వారులు, రాధాకాంతలు, రామానుజలవారు, నమ్మళ్వాల్, మానవాళ్ల మహాముని, దాసాంజనేయులకు ప్రత్యేక సన్నిధులు ఏర్పాటు చేశారు.
ఆలయానికి చేరుకోవడమిలా...
రాజాం – సంతకవిటి ప్రధాన రహదారిలో ఉన్న గుళ్లసీతారాంపురం రాజాం పట్టణం నుంచి 8 కిలోమీటర్లు, సంతకవిటి మండల కేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరు పక్కల నుంచి గ్రామానికి బస్సు, ఆటోల ద్వారా చేరుకోవచ్చు.
డోలోత్సవానికి ఏర్పాట్లు పూర్తి


