బస్సు ఒకటే..ప్రారంభోత్సవాలు రెండు..
● ముందుగా ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆర్టీసీ జోనల్ చైర్మన్ సర్వీస్ను ప్రారంభించిన వైనం
వేపాడ: మండల కేంద్రమైన వేపాడ నుంచి విశాఖపట్నానికి వేసిన ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి.. ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎస్.దొన్నుదొర ఆదివారం వేర్వేరుగా ప్రారంభించారు. ఉదయం 10.45 గంటలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వేపాడ చేరుకుని బస్సును ప్రారంభించి, మొదటి టికెట్ కొనుగోలు చేశారు. అక్కడకు గంట తర్వాత ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్నుదొర, ఆర్టీసీ డీఎం సుదర్శనరావు గ్రామానికి చేరుకుని జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల సమన్వయ లోపమో.. అధికారుల అలసత్వమో తెలియదు కాని ఒకే సర్వీస్ను రెండు సార్లు ప్రారంభించడం మాత్రం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఈ బస్సు ఎస్.కోటలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 6.15కు వేపాడ చేరుకుని పదిహేను నిమిషాల తర్వాత విశాఖకు బయలుదేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే ఇదే బస్సు సాయంత్రం 6.30 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 8.20 గంటలకు వేపాడ చేరుకుని అక్కడ నుంచి ఎస్.కోట చేరుకుంటుందని చెప్పారు.
బస్సు ఒకటే..ప్రారంభోత్సవాలు రెండు..


