రాజకీయ కక్షతో నిలిపేసిన పింఛన్ల పంపిణీ
గుర్ల: రాజకీయ కక్షతో నిలిపేసిన పింఛన్లను హైకోర్టు తీర్పుతో తిరిగి పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పున్నపురెడ్డిపేట, గరికివలస, పాలవలస, చోడవరం, గుజ్జింగివలస గ్రామాల్లో ఎనిమిది స్పౌజ్ పింఛన్లను ఆయా గ్రామాలకు చెందిన కూటమి నేతలు రాజకీయ కక్షతో ఏడాది క్రితం నిలిపివేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికి కూటమి నేతలకు తలొగ్గి మండల, జిల్లా అధికారులు ఎనిమిది మంది పింఛన్లు పంపిణీ చేయడానికి నిరాకరించారు. బాధితులు మండల, జిల్లా అధికారులకు అనేకసార్లు ఈ సమస్యపై విన్నవించుకున్నప్పటికి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయడానికి చొరవ చూపలేదు. దీంతో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు అర్హత ఉన్న ఈ ఎనిమిది పింఛన్లు మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిలిపేసిన పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఏడుగురు పింఛన్దారులకు ఫిబ్రవరి నెల నుంచి పింఛన్ నగదు అందించాలని తీర్పులో పేర్కొంది. గరికివలసకు చెందిన పింఛన్దారుడు కేసు ఇంకా పెండింగ్లో ఉంది. పునరుద్ధరించిన ఏడు పింఛన్ల నగదును వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం అందజేశారు. హైకోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురు దెబ్బని వారు పేర్కొన్నారు. పేదలకు అందుతున్న పింఛన్లను రాజకీయం చేసి నిలిపివేయడం దుర్మార్గమన్నారు. హైకోర్టు తీర్పుతో పింఛన్లు నగదు అందుకోవడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. పేదల కోసం పోరాటం చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
గుర్ల మండలంలో ఎనిమిది పింఛన్లు
నిలిపివేత
హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నేతలు
పింఛన్లు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశం


