గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్మీ జవాన్ దుర్మరణం
గరుగుబిల్లి: మండలంలోని గిజబ గ్రామ పరిధిలో శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ మలుపులో గుర్తు తెలియని వాహనం గురువారం ఢీకొన్న సంఘటనలో ఆర్మీ జవాన్ దవళసింగి చంద్రమౌళి(29) మృతి చెందారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్ఐ ఫకృద్ధీన్ తెలిపిన వివరాలు.. జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన చంద్రమౌళి తన స్నేహితుని వివాహానికి బుధవారం మండంలోని వల్లరగుడబ గ్రామానికి వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై శిఖబడి గ్రామం వెళ్తున్న సమయంలో గిజబ శివాలయం సమీపంలోని మలుపు వద్ద చినమేరంగి నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో పాటు కాలు విరిగి పోవడంతో ఘటనా స్థలంలోనే చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఎస్ఐ ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు గంగారావు, సత్యవతి తమ కుమారుడ్ని ప్రభుత్వ ఉద్యోగిగా చేయాలనే తలంపుతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చదివించారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు 2015లో నిర్వహించిన ఆర్మీ పరీక్షల్లో ప్రతిభ కనబరచి జవాన్గా ఎంపికయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్లో ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నారు. 2022లో సునీతతో వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో నిర్వహించే అగ్నిగంగమ్మ పండగ నిమిత్తం సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. స్నేహితుని వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, భార్య సునీత గుండెలు పగిలేలా విలపించారు. మృతునికి ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరున్న చంద్రమౌళి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.


