తప్పని డోలీ కష్టాలు
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల ప్రజలకు డోలీ కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రోడ్డు కష్టాలు తీరడం లేదు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హడావుడి చేయడమే తప్ప చేసిన పనులు కనిపించడంలేదంటూ గిరిజనులు ఆరోపిస్తున్నారు. అత్యవసర వేళ వైద్యం కోసం రాళ్లదారిలో కిలోమీటర్ల మేర డోలీలో రోగులను తరలించాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గురువారం ఉదయం ఎస్.కోట పంచాయతీ శివారు రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన గమ్మెల రేవతి ఉదయం జీడితోటలో పనిచేస్తుండగా విషపురుగు కాటుకు గురైంది. స్పృహకోల్పోయింది. ఆమెను స్థానికులు డోలీ సాయంతో హుటాహుటిన ఎస్.కోటలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె కోలుకోవడంతో తిరిగి సాయంత్రం డోలీలో గిరిశిఖరాన ఉన్న గ్రామానికి తరలించారు. ఓట్లు దండుకోవడం మినహా తమ కోసం పాలకులు చేసింది శూన్యమని గ్రామస్తులు జి.సంజు, ఎం.నాగేశ్వరరావు, బి.చిన్న, ఎం.కృష్ణ, వి.రాములమ్మ, తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు.


