ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు అభిలాష్
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి అవంతీ సెయింట్ థెరిసా ఇంజినీరింగు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ట్రిపుల్ ఈ విభాగం విద్యార్థి జె.అభిలాష్ ఆల్ ఆండియా తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రన్సిపాల్ జె.బాలభాస్కరరావు తెలిపారు. ఈ నెల 24వ తేదీన విశాఖపట్నం చైతన్య ఇంజినీరింగు కళాశాలలో గురజాడ స్పోర్ట్సు కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఎన్టీయూ గురజాడ అంతర కళాశాల యూనివర్సిటీ సెలక్షన్ ట్రయల్స్ పోటీల్లో 54 కేజీల విభాగంలో అభిలాష్ ప్రతిభ చాటారన్నారు. ఒడిశా రాష్ట్రంలోని డీఏవీ యూనివర్సిటీ జలంధర్లో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే ఆల్ ఇండియా తైక్వాండో పోటీల్లో అభిలాష్ ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. అభిలాష్ను ప్రిన్సిపాల్ డా.బాలబాస్కరరావుతో పాటుగా వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ, ఏఓ జి.అనిల్కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు సీహెచ్.శంకరరావుటివి.సోంబాబులు అభినందించారు.
బైక్ల దొంగ అరెస్ట్
● ఆరు బైక్ల స్వాధీనం
విజయనగరం క్రైమ్ : విజయనగరం పరిధిలో పలుచోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడు గుమ్మడి ఆదినారాయణను బుధవారం అరెస్టు చేసినట్టు టూ టౌన్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సుంకరి వీధిలో ఉంటున్న ఆదినారాయణను అరెస్టు చేసి ఆరు మోటారుసైకిళ్లను రికవరీ చేశామని చెప్పారు. వన్టౌన్, టూటౌన్ పీఎస్ పరిధిలో ఇటీవల పలు బైక్లు పోయామంటూ ఆయా బైక్ల యజమానులు స్టేషన్లలో ఫిర్యాదు చేశారన్నారు. టూ టౌన్ పీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజి ద్వారా నిందితుడిని గుర్తించి బాబామెట్ట వద్ద పట్టుకున్నామని తెలిపారు. రికవరీ చేసిన మోటారుసైకిళ్ల విలువ సుమారు రూ.2.5లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటకు చెందిన వాడని, గడిచిన ఆరేళ్ల నుంచి విజయనగరం సుంకరివీధిలో కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. డ్రైవరుగా పని చేస్తూ హ్యాండిల్ లాక్ వేయని మోటారుసైకిళ్లను దొంగిలించి తాకట్టుపెట్టి డబ్బులు సంపాదించడం వృత్తిగా అలవాటు చేసుకున్నాడని తెలిపారు. వన్టౌన్లో మూడు కేసుల్లో మూడు మోటారుసైకిళ్లు, టూటౌన్లో మూడు కేసుల్లో మూడు మోటారుసైకిల్లు దొంగిలించాడని చెప్పారు. వీటిని కోర్టు ఆదేశాలతో బైక్ యజమానులకు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రమీలాదేవి పాల్గొన్నారు.
ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు అభిలాష్


