గంజాయి రహిత సమాజమే లక్ష్యం : డీఐజీ
విజయనగరం క్రైమ్ : గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టి అన్నారు. తన రేంజ్ పరిధిలో ఐదు జిల్లాల ఎస్పీలతో ఆయన బుధవారం సమీక్షించి 20 నెలల ప్రగతి నివేదికను వెల్లడించారు. 2024 జూన్ నుంచి 2026 జనవరి వరకు రేంజ్ పరిధిలో ఐదు జిల్లాలో సాగిన గంజాయి వ్యతిరేక పోరాట వివరాలను వివరించారు. మొత్తం 24 అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించి, 129 మంది సభ్యులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. వారి ఆర్థిక మూలాలపై దెబ్బ తీసే విధంగా సుమారు రూ.9.19 కోట్ల ఆస్తుల జప్తు చేశామన్నారు. ఇప్పటివరకు 14 మంది ప్రధాన నిందితులకు సంబంధించి రూ.9,19,17,290 విలువైన ఆస్తులను గుర్తించి, వాటిని ఫ్రీజ్ చేస్తూ కన్ఫర్మేషన్ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, వి.విష్ణు స్వరూప్, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు, పరవాడ ఇన్స్పెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్.బాల సూర్యారావు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


