సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు

Feb 17 2026 7:15 AM | Updated on Feb 17 2026 7:15 AM

సమస్య

సమస్యల పరిష్కారానికి చర్యలు

ఏఎస్పీ వెంకటేశ్వరరావు

పార్వతీపురం రూరల్‌: అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు విన్న ఏఎస్పీ వాటిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఎస్సై పి. రమేష్‌నాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాశీ విశ్వేశ్వరుడ్ని దర్శించుకున్న మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడ్ని దర్శించుకుని వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆదివారం పూజలు చేశారు. కొన్నేళ్లుగా మహా శివరాత్రి రోజున కాశీలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని.. జగన్‌ మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేటి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో

ఏఐ కీలక పాత్ర

విజయనగరం అర్బన్‌: ఎలక్ట్రానిక్స్‌ రంగం అభివృద్ధిలో ఏఐ(కృత్రిమ మేధస్సు) కీలక పాత్ర పోషిస్తోందని, విద్యార్థులు ఏఐపై నైపుణ్యం సాధించే దిశగా అడుగులు వేయాలని ఏపీఎస్‌ఎస్‌డీసీ ట్రైనర్‌ ఎం.శివనాగరాజు అన్నారు. నగర పరిధిలోని సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్‌లో ఏఐ పాత్రపై ఇస్తున్న వారం రోజుల శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఏఐ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? రాబోయే రోజుల్లో అదెలా కీలకం కానుందోనన్న విషయాలను విద్యార్థులకు వివరించారు. మారుతున్న ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ శశిభూషణరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

పీఈబీ విధానంతో ప్రయోజనం..

డెంకాడ: ప్రీ – ఇంజినీరింగ్‌ బిల్డింగ్స్‌లో (పీఈబీ) నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావడంతో పాటు వ్యయం కూడా తగ్గుతుందని హైదరాబాద్‌కు చెందిన పెన్నిర్‌లోని డిజైన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రఖ్యాత నిపుణుడు మొహమ్మద్‌ రహమతుల్లా అన్నారు. చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు రప్రీ – ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌, సమగ్ర డిజైన్‌ పద్ధతులపై వారం రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ.. పీఈబీ అనేవి పరిశ్రమల్లో ముందే తయారు చేసి, పని వద్ద త్వరగా అమర్చగలిగే ఆధునిక ఉక్కు నిర్మాణాలన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైఎంసీ శేఖర్‌ మాట్లాడుతూ.. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీ రాజేంద్రప్రసాద్‌సింగ్‌, శిక్షణ సమన్వకర్త సాగి మురళిసాగర్‌వర్మ, సివిల్‌ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు 1
1/2

సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు 2
2/2

సమస్యల పరిష్కారానికి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement