
వినతుల పరిష్కారం
అర్జీదారు సంతృప్తి చెందేలా..
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం టౌన్: జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులపై అర్జీదారు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించి ప్రజల నుంచి 160 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన వినతులను ఆయాశాఖాధికారులకు సూచిస్తూ, వాటిపై సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె.హేమలత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ డా.పి.ధర్మచంద్రారెడ్డి డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల అధికారులు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
దివ్యాంగులకు ఉపకరణాలను జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పంపిణీ చేశారు. పాలకొండ మండలం కొండవీధికి చెందిన జమ్మాన తేజశ్రీ, సీతానగరం మండలం వెంకటాపురానికి చెందిన కట్టమూరి కార్తీక్ తమకు ల్యాప్ టాప్లు మంజూరు చేయాలని కోరగా, జేసీ వాటిని పంపిణీ చేశారు. అలాగే కొమరాడ మండలం ఆర్తాం గ్రామానికి చెందిన వడ్లమాని ప్రసాదరావుకు చెవిటి మిషనును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు ఎం.సుధారాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికార ప్రతినిధి రమణ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరిధిలో చర్యలు
పార్వతీపురం రూరల్: ప్రతి వారం నిర్వహించే పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదులు వాస్తవాలైతే తక్షణ చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందిని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించు కోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు రాగా డీసీఆర్బీ, మహిళా పీఎస్ హెడ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.