
పెద్దగెడ్డలో పూడిక తీత పనులు
సాలూరు: ‘పెద్దగెడ్డ.. పూడికలకు అడ్డా’ శీర్షికన సాక్షిలో ఈ నెల 13న ప్రచురితమైన కథనంపై పెద్దగెడ్డ అధికారులు స్పందించారు.ఈ మేరకు పెద్దగెడ్డ కాలువ పూడిక తీత పనులు ప్రారంభించారు.ముందుగా కాలువల్లో తుప్పల తొలగింపు చేపట్టారు. జేసీబీతో తుప్పలను తొలగిస్తున్నారు.ఈ నెలాఖరులోగా పనులు పూర్తిచేయించి ,పెద్దగెడ్డ నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు జేఈ మోహనరావు తెలిపారు.
డీఐఓగా అదనపు బాధ్యతలు
పార్వతీపురంటౌన్: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ జగన్మోహన్రావు అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు మంగళవారం ఆయనకు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం డాక్టర్ జగన్మోహన్రావు ఆర్బీఎస్కే, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారిగా కొనసాగుతున్నారు. గత నెల డీఐఓ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆ పోస్టు ఖాళీగా ఉన్నందున గతంలో డీఐఓ ఇన్చార్జిగా జగన్మోహ రావుకు జిల్లాలో టీకా కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్నందున ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ముద్దాయికి ఏడాది జైలుశిక్ష
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: ఓ యువతిని మోసగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి ఏడాది కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేలు జరిమానాను న్యాయస్థానం విధించినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలు ఆయన వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట పోలీస్ స్టేషన్లో 2021వ సంవత్సరంలో నమోదైన కేసులో ముద్దాయి మజ్జి రామరాజుకు విజయనగరం మహిళ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎన్.పద్మావతి పై విధంగా మంగళవారం తీర్పు వెలువరించారన్నారు. ముద్దాయి అదే గ్రామానికి చెందిన యువతికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని గర్భం దాల్చిన అనంతరం పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో తగిన సాక్ష్యాధారాలతో అభియోగ పత్రం దాఖలు చేశారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పూర్తయ్యి నేరారోపణలు రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు చెప్పారు.
1100 కేజీల చేపల మృతి
● చెరువులో విషం కలిపిన దుండగులు
దత్తిరాజేరు: మండలంలోని దత్తి గ్రామ సమీపంలో ఉన్న పాచిబంద చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో రూ.లక్షా 50వేల విలువ చేసే 1100 కేజీల చేపలు మృతి చెందినట్లు యజమాని పొట్నూరి ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. జీవనాధారం కోసం అప్పులు చేసి దత్తి గ్రామంలో చెరువు వేలంపాట పాడి చెరువులో వేసిన చేపలను వేయగా గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో అవి మృతి చెందాయని, తాను చేసిన అప్పులు ఎలా తీర్చేదని ఆవేదన చెందుతున్నాడు. గ్రామపెద్దలు, పెదమానాపురం పోలీసులకు ఈ సమాచారం అందజేసినట్లు తెలిపాడు.
పౌష్టికాహార కిట్లు పంపిణీ
విజయనగరం: నగరంలోని బొగ్గులదిబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు మంగళవారం పంపిణీ చేశారు. సామాజిక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా క్లబ్ తరఫున విటమిన్ మాత్రలు, డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహార విలువలు కలిగిన పౌడర్ను 67 మందికి అందజేశామని క్లబ్ అధ్యక్షుడు విజయ్కుమార్ అగర్వాల్ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ ఉదయ్, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ సుధాకుమారి తదితరులు పాల్గొన్నారు.

పెద్దగెడ్డలో పూడిక తీత పనులు

పెద్దగెడ్డలో పూడిక తీత పనులు

పెద్దగెడ్డలో పూడిక తీత పనులు