
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
చదురుగుడిలో చండీయాగం
మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయ ప్రాంగణంలో మూడో మంగళవారాన్ని పురస్కరించుకుని వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో చండీయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు శంబరి కృష్ణ యాగాన్ని నిర్వహించి, యాగవిశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

పుష్పాలంకరణలో పైడితల్లి