
మద్యం మత్తులో ఓ పోలీస్..!
● కారు నడిపి ఆటోను ఢీకొట్టి..
● ఒకరి మృతికి కారణమై..
● వాహనం నంబర్ ప్లేట్ మార్చి..
● నిందితుడిని కాపాడే ప్రయత్నంలో పోలీసులు
● బాధితులకు అండగా సీపీఎం
గరుగుబిల్లి/పార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండల పరిధిలోని సీతారాంపురం జంక్షన్లో మంగళవారం సాయంత్రం పోలీస్వాహనం ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఉల్లిభద్ర గ్రామానికి చెందిన బి.గణేష్ (42)కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగిన విషయం బయటకు రాకుండా నిందితుడు తనవంతు ప్రయత్నాలు చేశాడు. సంఘటనలో తీవ్ర గాయాలపాలైన గణేష్ చికిత్సపొందుతూ మృతి చెందడంతో పోలీసులకు బుధవారం సమాచారం అందించగా స్థానిక ఎస్సై కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో వాహనం నడిపిన పోలీసు
ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగి వాహనం నడిపి ఒకరి మృతికి కారణమయ్యారు. జియ్యమ్మవలస మండల పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎ.ప్రసాద్ డ్యూటీ డ్రెస్లో ఉండి మద్యం తాగి కారు నడిపి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ విషయమై చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు వద్ద ప్రస్తావించగా ప్రమాదం జరిగిన సమయంలో కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అని మెడికల్ టెస్టులు, రక్తపరీక్షలు చేయించామని, తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డికి నివేదించినట్లు తెలిపారు.
నంబర్ ప్లేట్ను మార్చిన
పోలీసులు
ప్రమాదం జరిగినప్పుడు కారుకు ఓన్బోర్డు ఉన్న నంబర్ ప్లేట్ను బుధవారం ఉదయానికి ట్యాక్సీ నంబర్ ప్లేట్గా (ఎల్లోబోర్డు) మార్చివేశారు. మార్చిన నంబర్ ప్లేటుతోనే కారును గరుగుబిల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇలా నంబర్ ప్లేట్లను మార్చి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాధితులకు అన్యాయం చేయడంతో పాటు చట్టాన్ని పక్కదోవ పట్టించేలా వ్యవహరించడంపై ఔరా అంటూ పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
బాధితులకు అండగా సీపీఎం
మంగళవారం సాయంత్రం ప్రమాదం జరిగినప్పటికీ బుధవారం ఉదయం వరకు కేసు నమోదు చేయకపోవడంపై సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బీవీ రమణ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదుపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని పోలీస్స్టేషన్లో సిబ్బందిని ప్రశ్నించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిందితుడైన కానిస్టేబుల్ను రక్షించేందుకు పోలీసు సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ మృతి చెందడంతో తప్పనిసరి పరిస్థితిలో కేసును నమోదు చేశారు తప్ప బాధితులకు న్యాయం చేద్దామని కాదన్నారు. ప్రమాదంపై తక్షణం విచారణ నిర్వహించి కానిస్టేబుల్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, మరణించిన గణేష్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నంబర్ ప్లేట్లు మార్చడం పట్ల, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రహదారి నిబంధనలు పోలీసులకు వర్తించవని ఈఘటనతో తెలుస్తోందన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు కె. రవీంద్ర, డి.వెంకటనాయుడు, వై.మన్మథరావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం ఉల్లిభద్ర జంక్షన్ వద్ద ప్రమాదంలో మృతిచెందిన గణేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మహిళలు, పెద్దలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై రమేష్ నాయుడు ధర్నా స్థలానికి వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మద్యం మత్తులో ఓ పోలీస్..!

మద్యం మత్తులో ఓ పోలీస్..!

మద్యం మత్తులో ఓ పోలీస్..!