
గిరిజనుల పొట్ట కొట్టొద్దు
వేపాడ: హైడ్రో పవర్ప్లాంట్ ఏర్పాటుకు అదానీ కంపెనీకి భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని కరకవలస పంచాయతీ గిరిశిఖర మారిక గ్రామంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్య క్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సీపీఎం ఆల్ ఇండియా కమిటీ సభ్యుడు లోకనాథం, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ తాతల, తండ్రుల నుంచి కొండలను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల పొట్టకొట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచ్తో కాని, ఇక్కడి ప్రజలతో కాని ప్రభుత్వం మాట్లాడకుండా గిరిజనులు నివసిస్తున్న కొండలు, గుట్టల్లో దాదాపు 213 ఎకరాలు అదానీకి ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయాలన్న, అక్కడి గిరిజనులకు పట్టాలు ఇవ్వాలన్నా అటవీశాఖ అనుమతులు ఉండాల ని చెబుతున్న ప్రభుత్వం.... ఇప్పుడు మరి ఏ అనుమతులు తీసుకుని అదానీకి ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్మినేని సూర్యనారా యణ మాట్లాడుతూ అధికారులు ముందుగా గ్రామసభ నిర్వహించి, 70శాతం మంది ప్రజలు అనుమతిస్తేనే భూసేకరణ చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వమే చట్టాన్ని అతిక్రమించి గిరిజనులను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమయ్యిందని మండిపడ్డారు. 125 గిరిజన కుటుంబాలకు అన్యాయం చేస్తుంటే సహించేది లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరకవలస సర్పంచ్ పాతబోయిన పెంటమ్మ, సీపీఎం, ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

గిరిజనుల పొట్ట కొట్టొద్దు