
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
● మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన గిరిజనులు
పార్వతీపురం రూరల్: మండలంలోని డీకే పట్నం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పీడిక అప్పన్న (55), ఊయక రమేష్ (25) మృతి చెందారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఈ ప్రమాదానికి సంబంధించి పార్వతీపురం రూరల్ ఎస్ఐ బి.సంతోషికుమారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సందివలస గ్రామానికి చెందిన పీడిక అప్పన్న అల్లుడు వరుసైన ఒడిశాలోని కార్లి గ్రామానికి చెందిన రమేష్తో ద్విచక్ర వాహనంపై సంధివలస నుంచి సొంత పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం డీకే పట్నం సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలం వద్ద రమేష్ మృతి చెందగా, డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ పీడిక అప్పన్న మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
తప్పిన ప్రమాదం
వంగర: మండల పరిధి మగ్గూరు కూడలి వద్ద శనివారం పెనుప్రమాదం తప్పింది. వరి నూర్పిడి అనంతరం కళ్లం నుంచి గ్రామంలోకి తీసుకువస్తున్న నూర్పిడి యంత్రం ఒక్కసారిగా బోల్తాపడింది. దీనిపై కూర్చున్న వేతనదారులు ప్రమాదాన్ని అంచనావేసి దూకేయడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించ లేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రోడ్డుపై బోల్తాపడిన నూర్పిడి యంత్రాన్ని జేసీబీ సహాయంతో సరిచేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి