
ర్యాపిడ్ కిట్లే దిక్కు..!
● ఇంకా సరఫరా కాని ఆర్టీపీఎస్ కిట్లు
● పలు జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ వ్యాధి తీవ్రత ఏవిధంగా ఉంటుందో ప్రజలం దరికీ తెలుసు, కరోనా సోకితే చాలా ఇబ్బంది పడతారు. కరోనా వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలు మీదికి వచ్చే ఆస్కారం ఉంది. నాలుగేళ్ల కిందట కోవిడ్ వ్యాధి యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా వణికించింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కూడా విధించారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికీ అ రోజులు తలుచుకుంటే ప్రజలు వణికిపోతారు. కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి మళ్లీ మొదలైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహారించాల్సి ఉంది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. కోవిడ్ కేసులు ఎక్కువవుతున్నప్పటికీ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాకు రాని ఆర్టీపీసీఆర్ కిట్లు
కరోనా వ్యాధి కచ్చితమైన నిర్ధారణ ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా అవుతుంది. గతంలో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి కోవిడ్ రోగులను నిర్ధారించేవారు. అంతటి ప్రాధాన్యం గల ఆర్టీపీసీఆర్ పరీక్షల కిట్లను కూటమి ప్రభుత్వం ఇంతవరకు జిల్లాకు సరఫరా చేయలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ర్యాపిడ్ కిట్లతో కోవిడ్ పరీక్షలు
కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రోగుల్లో వ్యాధి నిర్ధారణ కచ్చితంగా తెలుస్తుందో తెలియదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబొ రేటరీలను రోగులు ఆశ్రయిస్తున్నారు. సొంత డబ్బులతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకుంటున్నారు.
ఆర్టీపీసీర్ కిట్లు వస్తాయి
కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి ప్రస్తుతం ర్యాపిడ్ కిట్లుతో పరీక్ష చేస్తున్నాం. ఆర్టీపీసీఆర్ కిట్లు ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు వస్తాయి.
డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ