
నిఘా పెంచి మాదక ద్రవ్యాలకు
● క్యూఆర్ కోడ్తో సమాచారం
● జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
పార్వతీపురం టౌన్: జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిఘా అధికం చేయడం మాత్రమే కాకుండా వాహనాలను ఆకస్మిక తనిఖీలను చేపట్టడం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో మున్సిపాలిటీలు కనీసం 5వందల సీసీ కెమెరాలు సమకూర్చాలని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 1972 టోల్ ఫ్రీ నంబరుకు అందించాలని కోరారు. ఆర్టీసీ బస్సులలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి వివరాలతో అవగాహన పోస్టర్లను పెట్టాలన్నారు. అటవీ శాఖ అధికారులు ఆధునిక పరిజ్ఞానంతో అటవీ ప్రాంతంలో జరిగే మాదకద్రవ్యాల నియంత్రణ కార్యక్రమంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
క్యూఆర్ కోడ్లతో సమాచారం
క్యూఆర్ కోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మాదక ద్రవ్యాల సమాచారంపై ప్రజల స్పందన కూడా తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు 21 పోలీస్స్టేషన్ల పరిధిలో 7841 మంది ప్రజలు పాల్గొని స్పందన అందించారన్నారు. డ్రోన్ సర్వేలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు స్వయం రక్షణ పద్ధతులు నేర్పించడం, పాఠశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్బులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. జనవరి నుంచి మే వరకు మాదక ద్రవ్యాలకు సంబంధించి 11 కేసులను నమోదు చేశామని, ఇందులో 1875 కేజీల గంజాయి రవాణా చేయడం జరిగిందన్నారు. రవాణా శాఖ అధికారి ఎం.శశికుమార్ మాట్లాడుతూ రవాణా శాఖ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుందని, 199 కేసులను బుక్ చేయడం జరిగిందని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ జిల్లాలో నవోదయం రెండవ దశ పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. 27 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించామన్నారు.
సంయుక్తంగా దాడులు
ఆంధ్రా – ఒడిశా అధికారులు సంయుక్తంగా దాడులను నిర్వహించడం జరిగిందని, ఇందులో 50 వేల ఐదు వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. సారా తయారీకి సహకరిస్తున్న 64 మంది బెల్లం వ్యాపారులను గుర్తించామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి గయాజుద్దీన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం వినోద్, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్