
మాజీ ఎమ్మెల్యే పెద్ద మనసు
● రోడ్డు ప్రమాద బాధితులకు సపర్యలు
● దగ్గరుండి ఆస్పత్రికి తరలింపు
పాలకొండ రూరల్: మండలంలోని పనుకువలసకు చెందిన టి.మన్మథరావు, ఎస్.విశ్వనాథం గురువారం తమ సొంత పనులమీద ద్విచక్ర వాహనంపై వీరఘట్టం వైపు పయనమయ్యారు ఈ క్రమంలో గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురై గాయపడ్డారు. వారిద్దరూ ప్రధాన రహదారిపై రక్తమోడుతూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో పాలకొండ వస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి క్షతగాత్రులను గుర్తించి తన వాహనం నిలిపి క్షతగత్రులకు తన తల్లి మనసు చూపించి తక్షణ సపర్యలు అందజేశారు. అటుగా వస్తున్న పీహెచ్సీ వైద్యాధికారిని ఆపి బాధితులకు సేవలు అందించాలని కోరారు. క్షతగాత్రులను పరిశీలించిన వైద్యాధికారి వారిని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. 108 వాహనానికి మాజీ ఎమ్మెల్యే కళావతి ఫోన్ చేయగా వాహనం పార్వతీపురం దగ్గరలో ఉండడంతో అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రత్యేకంగా ఆటోలో బాధితులను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అనంతరం కళావతి కూడా ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన సేవలందించాలని కోరారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు. సరైన సమయంలో స్పందించిన మాజీ ఎమ్మెల్యే కళావతి బాధితులను రక్తమోడిన గాయాలతో బాధపడుతుండగా ఆమె కళ్లు చెమర్చాయని, మానవత్వం చాటుకున్నారని ఘటనాస్థలంలో ఉన్నవారు చర్చించుకున్నారు.