
15 శాతం వృద్ధిరేటు సాధించేలా ప్రణాళిక
రాజాం సిటీ/చీపురుపల్లి జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, 15 శాతం వృద్ధిరేటు నమోదుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. రాజాంలోని పాలకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్, చీపురుపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వేర్వేరుగా నియోజకవర్గ స్థాయి అధికారులు, సిబ్బందితో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తలసరి ఆదాయం పెంచే మార్గాలపై దృష్టిసారించాలన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో ఎక్కువ అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూమి జిల్లాలో 3 లక్షలు ఎకరాలు ఉండగా, లక్షా80 వేల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయన్నారు. ఉద్యాన, వాణిజ్య పంటల సాగు విస్తరణ, ఉత్పత్తి పెంచడంపై దృష్టిసారించాలని సూచించారు. త్వరలో ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక పౌల్ట్రీ ఫారం ఏర్పాటుచేసి మాంసం, గుడ్లు ఉత్పత్తి పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో సగటున రోజుకి పాల వినియోగం 10 లక్షల లీటర్లు వరకు ఉండగా, కేవలం 6 లక్షల లీటర్కేల ఉత్పత్తి అవుతు న్నాయన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, ఉద్యానవశాఖ డీడీ జమదగ్ని, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ సత్యవాణి, ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఆనందరావు, కమిషనర్ రామప్పలనాయుడు, చీపురుపల్లి నియోజకవర్గ ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎనిమిది మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

15 శాతం వృద్ధిరేటు సాధించేలా ప్రణాళిక