
మలేరియా పట్ల అప్రమత్తం
● గతంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి
● ప్రస్తుతం మైదాన ప్రాంతంలోనూ
అధికంగా కేసుల నమోదు
● సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాల మీదికి
● నేడు ప్రపంచ మలేరియా నివారణ దినం
విజయనగరం ఫోర్ట్: మలేరియా పేరు వినగానే మన్యప్రాంత ప్రజలు వణికిపోతారు. మలేరియా బారిన పడి ఎంతోమంది ఇబ్బంది పడేవారు. మరికొంతమంది వ్యాధితో పోరాటం చేయ లేక మృత్యువాత పడేవారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలోనూ మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లాలో మలేరియా కేసులు కొంతకాలంగా పెరుగుతున్నాయి. మలేరియా వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు మీదికి వచ్చే ప్రమాదం ఉంది.
అనాఫిలిస్ దోమ కుట్టడంతో వ్యాధి వ్యాప్తి
మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే ఏకకణ పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్న జీవులు ఆడ అనాఫిలిస్ దోమకాటు వల్ల మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్టుంది. మలేరియా వచ్చినతర్వాత చికిత్స పొందేకంటే దోమతెరలు వాడి దోమకాటును నివారించి, మలేరియా రాకుండా చేసుకోవడం ఉత్తమం.
మలేరియాలో రెండు రకాలు
మలేరియా వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. అవి వైవాక్స్ మలేరియా, పాల్సి ఫారమ్ మలేరియా.
వ్యాధి లక్షణాలు:
తీవ్రమైన చలి జ్వరం, రోజువిడిచి రోజు జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, మలేరియా లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
ఏడాదికి 800 నుంచి 1000 వరకు కేసులు
మలేరియా కేసులు ఏడాదికి 800 నుంచి 1000 వరకు నమోదవుతున్నాయి. 2023–24లో 439 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2024–25లో 805 కేసులు నమోదయ్యాయి. 2025 –26లో ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి.
నివారణ చర్యలు
మలేరియా సోకిన పిల్లలు, గర్భిణులకు చికిత్స చేయించడంలో జాప్యం చేయకూడదు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకమవుతుంది. మలేరియా వ్యాధి నిర్ధారణ అయిన గర్భిణులు 3 వనెల నుంచి ప్రసవించే వరకు వారానికి రెండు క్లోరోక్విన్ మాత్రలు వాడడం ద్వారా మలేరియా వ్యాధిని నివారించవచ్చు.
● సింథటిక్ ఫైరిడ్రాయిడ్ క్రిమిసంహారక మందును ఇంటి లోపల అన్ని గదులలోను పైకప్పు లోపలి భాగంలో పిచికారీ చేసి తుడవడం గాని, గోడలను అలకడం గాని చేయకుండా చూడాలి
● ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి
● సాయంత్రం వేళ వేపాకు పొగ రూపంలో దోమలను పారదోలవచ్చు
● జ్వరం వచ్చిన వారందరూ ఉచితంగా రక్త పరిక్ష చేయించుకుని ఒక రోజు క్లోరోక్విన్ మాత్రలు వేసుకోవాలి
●నీరు నిల్వ ఉండే గోలాలు, ఎయిర్ కూలర్లు, వారానికి ఒకసారి ఖాళీ చేసి బాగా తడి ఆరిన పిమ్మటనే మళ్లీ నీరు పెట్టాలి. వీధి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేలా చూడాలి
● బావుల్లోను, పూడ్చ లేని కందకాలలోను దోమ లార్వాలను తినే గంబూషియా చేపపిల్లలను విడిచిపెట్టి దోమలు పెరగకుండా చేయవచ్చు. ప్రతి ఇంట్లోను దోమల మందు పిచికారీ చేయించుకోవాలి. దోమతెరలు వాడితే మంచిది.
మలేరియా నివారణకు చర్యలు
మలేరియా నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. మలేరియా నివారణలో భాగంగా దోమలను నివారించేందుకు ఏడాదికి రెండుసార్లు స్ప్రేయింగ్ చేపడుతున్నాం. సచివాలయం సీహెచ్ఓలు, ఏఎన్ఎంల వద్ద కూడా మలేరియా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వారు గ్రామస్థాయిలోనే మలేరియా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్ఓ

మలేరియా పట్ల అప్రమత్తం