
గంజాయి నిందితుల ఆస్తులు జప్తు చేయాలి
పార్వతీపురం రూరల్: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే నిందితుల ఆస్తులను జప్తు చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో పలు జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో డీఐజీ వెల్లడించినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. అలాగే గంజాయి కేసుల్లో ఉన్న నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరాన్ని డీఐజీ తెలియజేసినట్లు చెప్పారు. గంజాయి రవాణా నియంత్రణకు చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు ప్రారంభించాలని ఆదేశించారని, తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టుచేసి వారిపై నాన్బెయిల్బుల్ వారెంట్లు తక్షణమే అమలు చేయాలని ఆదేశించారన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి
నేరాల నిరోధంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చి సీసీటీవీలు, డ్రోన్ల సహాయంతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి దర్యాప్తు నిర్వహించాలని, సైబర్ క్రైం, అలాగే సోషల్ మీడియాలో వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సైబర్ మోసాల పట్ల ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని, టోల్ఫ్రీ నంబర్ 1930 వినియోగం ప్రజలకు తెలియజేయాలని డీఐజీ ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.
సీసీ కెమెరాలు, డ్రోన్లతో గంజాయికి అడ్డుకట్ట
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రి అనిత ఆదేశాలతో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తన కార్యాలయంలో ఐదు జిల్లాల ఎస్పీలతో మంళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాఽథ్ జెట్టి గంజాయి అక్రమరవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్ట్, వారి ఆస్తుల జప్తుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి