సాక్షి, విశాఖపట్నం: మేజర్ పోర్టులతో పోటీపడుతూ సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 92 ఏళ్ల వీపీఏ సుదీర్ఘ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 90.29 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సరుకు రవాణాను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను.. గతేడాది సాధించిన 82.62 ఎంఎంటీ రికార్డును అధిగమించడమే కాకుండా, నిర్దేశిత గడువు కంటే ముందే (362 రోజుల్లోనే) ఈ ఘనతను సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంపై పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల సమర్థవంతమైన నిర్వహణ, ఉద్యోగుల సమిష్టి కషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న 2026–27 ఆర్థిక సంవత్సరంలో 100 ఎంఎంటీ సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి భాగస్వామ్య సంస్థలను అభినందించినట్లు పోర్ట్ కార్యదర్శి శంకర్ బాబు వెల్లడించారు.


