గాజువాక: చినగంట్యాడలోని మణికంఠ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ ఎన్నశెట్టి అప్పారావును పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుల నుంచి ఆయన ఖాళీ సిలిండర్లను, ఓటీపీలను సేకరించి పరారైన విషయం తెలిసిందే. తమకు సిలిండర్లు ఇవ్వకుండానే డెలివరీ చేసినట్టు మొబైల్ ఫోన్ద్వారా మెసేజ్లు రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏజెన్సీ మేనేజర్ ఎదరపల్లి విజయ రామమోహన్రాజు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది. దీనిపై సీఐ పార్థసారధి నేతృత్వంలో ఎస్ఐ జగదీష్, సిబ్బందితో కలిసి విచారించి 24 గంటల్లో అప్పారావును అరెస్టు చేశారు. అప్పారావు వినియోగదారుల వద్ద సేకరించిన ఖాళీ సిలిండర్లు, ఓటీపీల ద్వారా ఏజెన్సీ నుంచి గ్యాస్ నింపిన సిలిండర్లను సేకరించాడు. వాటిని వినియోగదారులకు ఇవ్వకుండా అధిక మొత్తాలకు బ్లాక్ మార్కెట్లో విక్రయించాడు. వినియోగదారుల నుంచి 33 సిలిండర్లను, ఏజెన్సీకి చెందిన తొమ్మిది సిలిండర్లను సేకరించి అక్రమంగా అమ్ముకున్నట్టు సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది వినియోగదారుల నుంచి రూ.13,500 వసూలు చేసి ఆ నగదును కూడా సొంతానికి వాడుకున్నట్టు పోలీసులు తెలిపారు.


