అప్పన్న ఆస్తుల పరిరక్షణే ధ్యేయం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆస్తులను పరిరక్షించడమే తన ప్రధాన లక్ష్యమని ఈవో జె. వెంకటరావు స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం సింహగిరిపై ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడంతో పాటు ఆలయ పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడబోమని హామీ ఇచ్చారు. క్షేత్ర అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని, భక్తులకు ఉపయోగపడే సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని తెలిపారు. సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులు రమణ, రామకృష్ణ, హరి, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


