
జైలులో సౌకర్యాలపై ఆరా
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సన్యాసినాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలులోని ఖైదీల బ్యారక్లను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడిన సన్యాసినాయుడు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, భోజనం, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైలులో ప్రస్తుతమున్న ఖైదీల సంఖ్య, వారి ప్రవర్తన గురించి జైలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం కారాగారం న్యాయ సహాయ కేంద్రంలో రిమాండ్ ఖైదీలతో మాట్లాడి, వారికి అవసరమైన న్యాయ సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు కె. జవహర్ బాబు, సి. ప్రవీణ్ కుమార్, ఇతర జైలర్లు పాల్గొన్నారు.