
నిమిషానికి ఒకటిన్నర అంశం.. ఇదేం చర్చో?
● నాలుగు గంటల్లో 299 అంశాలపై చర్చ ● జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశంపై విమర్శలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 299 అజెండా అంశాలపై జరిగిన చర్చ.. చర్చనీయాంశంగా మారింది. సగటున ఒక్కో అంశానికి నిమిషం కన్నా తక్కువ సమయం కేటాయించడంపై, కీలకమైన నగర సమస్యలపై తూతూమంత్రంగా జరిపిన చర్చపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు మూడు నెలలు తర్వాత మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం తొలి స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారుల తీరు మొక్కుబడిగా ఉందని మేయర్ చిర్రుబుర్రులాటారు. ‘ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ఆ మాత్రం పనిచేయకపోతే ఎలా? జీవీఎంసీ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? పూర్తి సమాచారం లేకుండా సమావేశానికి రావొద్దు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అధికారులకు ఇంతటి క్లాస్ తీసుకున్న మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశం తుఫాన్ వేగంతో ముగియడం విమర్శలకు తావిస్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం గంట ఆలస్యంగా 12 గంటలకు మొదలైంది. అప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. అంటే కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే సమావేశం జరిగింది. ఈ సమయంలోనే 286 సాధారణ, 13 టేబుల్ అజెండాతో కలిపి మొత్తం 299 అంశాలను సభ్యులు చర్చించారు. వీటిలో 239 అంశాలను ఆమోదించగా, 60 అంశాలను వాయిదా వేశారు. ఇంజినీరింగ్, రెవెన్యూ, కాంట్రాక్టులు, పరిపాలన, ప్రజారోగ్యం వంటి అత్యంత కీలకమైన, అంశాలపై నిమిషాల వ్యవధిలో ఎలా కూలంకషంగా చర్చించి ఉంటారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అలసత్వంపై మండిపడి.. ఇలా నామమాత్రంగా సమావేశం ముగించడం ఎంతవరకు సమంజసమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు ఇప్పినాయుడు, కె.శివప్రసాద్, మల్లయ్యనాయుడు, బి.రాము, బీఆర్.ఎస్.శేషాద్రి, హేమావతి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్, యూసీడీ పీడీ పీఎం సత్యవేణి, సెక్రటరీ బీవీ రమణ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, పరిపాలనాధికారి పద్మజ, పర్యవేక్షక ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.