
కట్..!
గ్రేటర్కు వాటర్
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. టౌన్ సర్వే రిజర్వాయర్, నరవ హెడ్ వాటర్ వర్క్స్, పద్మనాభంతో పాటు పలు జోనల్ కార్యాలయాల వద్ద కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.
డాబాగార్డెన్స్: ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారంటే..
ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తు న్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తాగునీటికి ఇబ్బందులు లేకుండా
చర్యలు చేపట్టండి
తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలని కోరారు.
ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట
పట్టించుకోని అధికారులు, మేయర్
ప్రజలకు నీటి కష్టాలు

కట్..!