
ముడిసరకు లేకుండానే మూడో ఫర్నేసా..
స్టీల్ప్లాంట్లోని
బ్లాక్ ఫర్నేస్–3
గాజువాక : గతంలో ఒకసారి బీఎఫ్–3ని ప్రారంభించినా, కేవలం రెండు నెలలకే ముడిసరకు కొరత కారణంగా మూసివేయాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా తగినన్ని ముడిసరకు నిల్వలు లేకుండానే మళ్లీ ఫర్నేస్ను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్లను బ్యాంకుల అప్పులు తీర్చడానికే వినియోగించి స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరకు సమకూర్చలేదు. స్టీల్ప్లాంట్ లాంటి ఇంటిగ్రేటెడ్ పరిశ్రమలో కనీసం 45 రోజులకు సరిపడా ముడి సరకు నిల్వలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలలకు సరిపడా ముడి సరకును సమకూర్చిన తర్వాతే బీఎఫ్–3ను ప్రారంభిస్తామని గతంలో స్టీల్ జాయింట్ సెక్రటరీ ప్రకటించారు. కానీ ప్రస్తుతం ప్లాంట్కు అవసరమైన ముడిసరకు అందుబాటులో లేదని కంపెనీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫర్నేస్ను ప్రారంభిస్తే ప్లాంట్ నష్టాల బారిన పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూలింగ్ ప్లేట్ల సమస్య.. అదనపు భారం
గతంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బీఎఫ్–3ని ప్రారంభించి, ఆ తర్వాత మూసివేశారు. ఈ కారణంగా ఫర్నేస్లోని కీలకమైన కూలింగ్ ప్లేట్లు దెబ్బతిన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల కూడా స్టీల్ ఉత్పత్తిలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఈ ప్లేట్ల కోసం ప్లాంట్ యాజమాన్యం అదనంగా ఖర్చు చేసింది. ఇతర దేశాల నుంచి కూలింగ్ ప్లేట్లు ఇక్కడికి చేరాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. కానీ అత్యవసరంగా వాయు రవాణా ద్వారా తెప్పించడం వల్ల ప్లాంట్పై అదనపు ఆర్థిక భారం పడిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన అనుభవం నుంచి పాఠాన్ని తీసుకోని ప్రభుత్వం బీఎఫ్–3ని పునఃప్రారంభించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు.
మూడో బ్లాస్ట్ ఫర్నేస్ చుట్టూ సందేహాలు
సరిపడినంత ముడిసరకు లేదంటున్న కంపెనీ వర్గాలు
సింటర్, బ్యాటరీల సామర్థ్యంసరిపోదంటున్న ఉద్యోగులు
స్టీల్ను రోల్ చేయగలిగే సామర్థ్యంపైనా అనుమానాలు
కంపెనీపై ఆర్థిక భారంపెరుగుతుందంటున్న కార్మికవర్గం
విశాఖ స్టీల్ప్లాంట్లో మూడో బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్–3)ను ఈ నెల 27న పునఃప్రారంభించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టీల్ప్లాంట్ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బీఎఫ్–3ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. బీఎఫ్–3ని ప్రారంభించాలనుకోవడం మంచి విషయమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయంపై పరిశ్రమ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.
సామర్థ్యంపై సందేహాలు
సింటర్ ప్లాంట్
బీఎఫ్–3 సమర్థంగా పని చేయాలంటే సింటర్ ప్లాంట్లో తగినంత సింటర్ అందుబాటులో ఉండాలి. ఇక్కడ ప్రస్తుతం మూడు మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ సమర్థంగా పని చేయాలంటే అదనంగా మరో సింటర్ మిషన్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మిషన్లను పూర్తిస్థాయిలో వాడితే మూడు మిషన్లు సరిపోతాయని యాజమాన్యం చెబుతోంది. అయితే ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా ఉత్పత్తిని ఆపుకోవాల్సి వస్తుందని, అందువల్ల నాలుగో సింటర్ మిషన్ అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కోక్ ఒవెన్
కోక్ ఒవెన్ విభాగంలో ఆరో బ్యాటరీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి నష్టాలు వస్తాయని అంచనా. ప్రస్తుతం దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కానందున, దీని నిర్వహణను ప్రైవేట్కు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పెల్లెట్స్
ఉత్పత్తిలో కీలకమైన పెల్లెట్లను బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల ఒక్కో టన్ను ఉత్పత్తికి రూ.4,000 అధిక ఖర్చు అవుతోందని లెక్కలు చెబుతున్నాయి. ఇది కూడా ప్లాంట్పై అదనపు భారమే.
రోలింగ్ మిల్స్
ప్రస్తుతం ప్లాంట్లో 5.5 మిలియన్ టన్నుల స్టీల్ను మాత్రమే రోల్ చేయగలిగే సామర్థ్యం ఉంది. బీఎఫ్–3 ప్రారంభమైతే ఉత్పత్తి 7.5 మిలియన్ టన్నులకు చేరుతుంది. ఆ అదనపు స్టీల్ను రోల్ చేసే సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నకు సమాధానం లేదు.
ఇన్ని సవాళ్ల మధ్య బీఎఫ్–3ని పునఃప్రారంభించి, దాన్ని సమర్థంగా నిర్వహించగల సత్తా యాజమాన్యానికి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, ప్లాంట్కు అవసరమైన సొంత గనులను కేటాయించాలని నిపుణులు, కార్మికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. లేదా సెయిల్లో ఈ ప్లాంట్ను విలీనం చేస్తే కొంతమేరకై నా పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.