ఉక్కు ఉద్యమంపై కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఉక్కు ఉద్యమంపై కుట్ర

Jun 10 2025 6:50 AM | Updated on Jun 10 2025 6:50 AM

ఉక్కు ఉద్యమంపై కుట్ర

ఉక్కు ఉద్యమంపై కుట్ర

● పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం వేధింపులు ● దీక్షా శిబిరాన్ని ఆక్రమించిన పోలీసులు ● నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు ● పోలీసుల తీరుపై ఉక్కు కార్మికుల ఆగ్రహం

కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కూర్మన్నపాలెం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. 1,579 రోజులుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతుండగా సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా దీక్షా శిబిరంలోకి పోలీసులు చొరబడి కుర్చీలలో ఆశీనులవడంతో ఆగ్రహించిన కార్మికులు నేలపై కూర్చుని నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసులు దౌర్జన్యం ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వం విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కార్మిక సంఘాల నేతల ధ్వజం

అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తు న్నాయని దుయ్యబట్టారు. శాంతియుతంగా జరుగుతున్న దీక్షలను పోలీసుల ద్వారా అణచివేయాల ని చూడటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని కారణం చూపి వారిని తొలగించడం సరికాదని పేర్కొన్నారు. కర్మాగారం స్థాపించినప్పటి నుంచి అనేక పోరాటాలు చేశామని, ఇంత దారుణంగా ఎవరూ ఎప్పుడూ వ్యవహరించలేదని పోరాట కమిటీ చైర్మన్‌ డి. ఆదినారాయణ ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా దీక్షా శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలు విడనాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.

సిటు గౌరవ అధ్యక్షులు జె. అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, కార్మికులను అణచివేసి కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది పాలకులకు క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 78వ వార్డు కార్పొరేటర్‌ బి. గంగారావు మాట్లాడుతూ, కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కుట్ర ప్రభుత్వ విధానాల్లో భాగమేనని, కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌ లో భాగంగానే కార్మికుల ఉద్యమాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని గంగారావు హెచ్చరించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ, కేఎం.శ్రీనివాస్‌, రామచంద్రరావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న ఉక్కు కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement