
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
జిల్లా వ్యాప్తంగా పోలీసులకు జర్నలిస్టుల ఫిర్యాదు
ఆరిలోవ/తగరపువలస/గాజువాక/అల్లిపురం/పెందుర్తి: రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆరిలోవలో సీఐకి ఫిర్యాదు అందజేయగా.. గాజువాక సీఐ పార్థసారధిని స్థానిక సాక్షి విలేకరులు కలిసి ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే టూటౌన్ ఎస్.ఐ సతీష్కు సాక్షి విలేకరులు ఫిర్యాదు చేశారు. సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులను భీమిలి నియోజకవర్గంలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టాయి. మధురవాడ ప్రాంత పాత్రికేయులు ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణకు ఫిర్యాదు అందజేశారు. భీమిలి ప్రెస్క్లబ్ ప్రతినిధులు హెడ్ కానిస్టేబుల్ సన్యాసిరావుకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రమణకు సాక్షి విలేకరులు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.