
జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలి
11న ఉన్నతాధికారులకు వినతిపత్రాల అందజేత
డాబాగార్డెన్స్: వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి కేంద్రం రద్దు చేసిన రెండు చట్టాలను పునరుద్ధరించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9న అఖిల భారత కార్మిక సంఘాలు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘాలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా 44 కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేయగా అందులో వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 ఉన్నాయన్నారు. వీటి పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఈ నెల 11న పాత్రికేయుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్ నుంచి తహసీల్దార్, ప్రజాప్రతినిధులకు అందిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ జిల్లా అధ్యక్షుడు ఇరోతు ఈశ్వరరావు, కింతాడ మదన్, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవళేశ్వరపు రవికుమార్, సాంబశివరావు,ప్రసాద్ పాల్గొన్నారు.