
సముద్ర ఆహార రంగాభివృద్ధికి నైపుణ్యం కీలకం
డాబాగార్డెన్స్: సముద్ర ఆహార విలువ జోడింపుపై గురువారం నగరంలో అంతర్ రాష్ట్ర నైపుణ్య ఒలింపియాడ్ జరిగింది. సముద్ర ఆహార ప్రాసెసింగ్ నిపుణుల కోసం మైరెన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ) తొలిసారిగా ‘ఇంటర్ స్టేట్ స్కిల్ ఒలింపియాడ్ ఆన్ సీఫుడ్ వాల్యూ అడిషన్ ప్రిలిమినరీ రౌండ్(జోన్ ఐఐ ఈస్ట్ కోస్ట్)’ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీఈడీఏ కార్యదర్శి అనిల్కుమార్ ప్రారంభించి మాట్లాడారు. భారతదేశ సముద్ర ఆహార రంగాన్ని అభివృద్ధి చేయడంలో నైపుణ్యాభివృద్ధి, విలువ జోడింపు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఇది భారత ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఎంపీఈడీఏ జాయింట్ డైరెక్టర్ విజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీఎస్ఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి.లక్ష్మణరావు, నెక్కంటి సీఫుడ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్, శాస్త్రవేత్త డాక్టర్ కిజకుడాన్, ఫిష్ ప్యాకర్స్ ప్రతినిధి నాగహనుమాన్, రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తూర్పు తీరానికి చెందిన 20 మంది నైపుణ్యం కలిగిన సముద్ర ఆహార నిపుణులు ఇంటర్–స్టేట్ స్కిల్ ఒలింపియాడ్లో పాల్గొన్నారు. వీరు రొయ్యలు, స్క్విడ్, తిలాపియాతో 10 విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులను తయారు చేశారు. సముద్ర ఆహార పరిశ్రమ, మత్స్య సంస్థల నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల ప్యానెల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించింది. కార్యక్రమంలో ప్రాసెసింగ్ టెక్నాలజిస్ట్ డాక్టర్ రమ్యకుమారి, కోటేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
ఎంపీఈడీఏ కార్యదర్శి అనిల్కుమార్