
దిక్కులేని జీవీఎంసీ
● కమిషనర్ లేని పాలన.. విశాఖకు తీరని వేదన ● ఫైళ్లు పేరుకుపోతున్నాయి.. పనులు సాగడం లేదు ● జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ ఎప్పుడు? ● కూటమి నిర్లక్ష్యంపై నగర ప్రజల ఆగ్రహం
డాబాగార్డెన్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఐదు నెలలుగా రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో నగర పాలన పూర్తిగా గాడితప్పింది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు నెలల తరబడి కీలక అధికారిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్తంభించిన పాలన
రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో జీవీఎంసీలో పర్యవేక్షణ కొరవడింది. పాలన స్తంభించిపోయింది. సుమారు 20 లక్షల జనాభా, 98 వార్డులున్న జీవీఎంసీ బాధ్యతలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు కలెక్టరేట్ వ్యవహారాలు.. మరోవైపు జీవీఎంసీ బాధ్యతలతో ఆయన సతమతమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడి, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కింది స్థాయి అధికారులు సైతం తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తుండడంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. పనులు ముందుకు సాగడం లేదు. నూతన మేయర్ సైతం సమీక్షలకే పరిమితమయ్యారని, అధికారులను జవాబుదారీ చేసే స్థాయిలో చర్యలు కొరవడ్డాయని విపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
అటకెక్కిన అభివృద్ధి, పారిశుధ్యం
కమిషనర్ లేని లోటు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కమిషనర్ హయాంలో మురికివాడల అభివృద్ధి, రూ.500 కోట్లతో తాగునీటి పైపులైన్ల మంజూరు, గుర్తించిన 1,150 ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధి వంటి కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో చేపట్టాల్సిన పనులన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడటంతో పారిశుధ్య నిర్వహణ దయనీయంగా మారింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. మురికివాడలు, కొండవాలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దక్షిణ నియోజకవర్గంలో ప్రసాద్ గార్డెన్స్, వెలంపేట, పండావీధి, అల్లిపురం, కొబ్బరితోట, పద్మానగర్, చిలకపేట, జాలారిపేట, రంగిరీజువీధి, చెంగల్రావుపేట, జబ్బరతోట, పెయిందొరపేట, కోటవీధి, ఫెర్రీరోడ్డు, తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవ, డెయిరీఫాం ఏరియా, రామ్నగర్తో పాటు పలు మురికివాడ ప్రాంతాలు, ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు కొండవాలు ప్రాంతాలు, మురికివాడ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.
జీవీఎంసీని గాడిలో పెట్టేదెవరు?
జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం నగర పాలనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫైళ్లు కదలడం లేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు కమిషనర్ను నియమించకుండా కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమేంటో? నగర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కమిషనర్ను నియమించడం అత్యవసరం.
– బానాల శ్రీనివాసరావు, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్
ప్లాస్టిక్ నియంత్రణ ఎక్కడ?
నగరంలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతోంది. గత మేయర్, కమిషనర్ హయాంలో చేపట్టిన ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, డోర్–టు–డోర్ ప్రచారాలు, నియంత్రణ కమిటీలు అన్నీ అటకెక్కాయి. దీంతో నగరంలో మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దర్శనమిస్తోంది.
ప్రజాగ్రహం, ప్రతిపక్షాల ఆందోళన
జీవీఎంసీకి కమిషనర్ను నియమించడంలో ప్రభుత్వ వైఫల్యంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్నే నియమించలేని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడం జీవీఎంసీ చరిత్రలోనే ఇది మొదటిసారని, ఇది కూటమి ప్రభుత్వ ఘనకార్యమని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. తక్షణమే సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించి, నగర పాలనను గాడిలో పెట్టాలని సీపీఎం, సీపీఐ ఫ్లోర్ లీడర్లు గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. సమర్థంగా పనిచేస్తున్న కమిషనర్ను అర్ధాంతరంగా బదిలీ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం విశాఖను దిక్కులేని నగరంగా మార్చివేశారని, ప్రజల సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని మండిపడ్డారు.

దిక్కులేని జీవీఎంసీ