అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

Jun 3 2025 6:48 AM | Updated on Jun 3 2025 6:48 AM

అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

● కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ ● పీజీఆర్‌ఎస్‌కు 253 వినతులు

మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) లో అందిన అర్జీలపై తక్షణమే చర్యలు తీసుకొని, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అర్జీలు మళ్లీ పునరావృతం అయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతకు ముందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. ప్రతిరోజు శాఖాపరమైన సమీక్షలు నిర్వహించి, పీజీఆర్‌ఎస్‌కు అందిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా, గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 అధికారు లు పేద కుటుంబాలను (బంగారు కుటుంబాలుగా గుర్తించి) దత్తత తీసుకోవాలని, వారికి విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి వంటి అవసరాలకు సహాయం అందించాలని కోరారు. జూన్‌ 21న నిర్వహించే ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో అధికారులు చురుకుగా పాల్గొని, తమ కార్యాలయ ఉద్యోగులను, పరిసర ప్రాంతాల వారిని భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీ–షర్టులు, యోగా మ్యాట్‌లు అందజేస్తారని, ముందుగా వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

253 అర్జీల స్వీకరణ

సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి మొత్తం 253 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 93, పోలీసు శాఖకు 21, జీవీఎంసీకి 77, ఇతర విభాగాలకు 62 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్‌, జీవీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ వర్మ సహా పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement