
టిడ్కో లబ్ధిదారుల ఆందోళన
అగనంపూడి: జీవీఎంసీ 88వ వార్డు మంగళపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద ఆదివారం ప్లాట్ల కేటాయింపుదారులు ఆందోళనకు దిగారు. ఇక్కడ పదేళ్ల కిందట నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. అయితే గృహాలను ఇప్పటికీ అందజేయలేదు. పైగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగదు చెల్లింపులు చేసిన లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గృహ సముదాయం నిర్మించి పదేళ్లు అవుతోందన్నారు. లబ్ధిదారులందరూ నిర్ణీత మొత్తం చెల్లించారని, నేటికీ గృహాలు కేటాయించకపోవడం వల్ల నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కనీస వసతులు కల్పించి, లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించి సేల్ డీడ్లు అందివ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టిడ్కో ప్రాజెక్టు డీఈ రాజేష్, టాటా ప్రాజెక్టు అధికారి సోమేష్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. మూడు నెలల్లో ప్రాథమిక వసతులు కల్పించి ప్లాట్లు అప్పగిస్తామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. నాయకులు కె.వనజాక్షి, జి.ఆనంద్, కె.అచ్చుతరావు, పిల్లా పద్మ, రొక్కమ్ శ్రీనివాసరావు, గోపి, పి.అప్పలరాజు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

టిడ్కో లబ్ధిదారుల ఆందోళన