
హాస్టళ్లలో సెల్ఫోన్ల చోరీ కేసు ఛేదన
నిందితుడి అరెస్ట్, 12 ఫోన్లు స్వాధీనం
తాటిచెట్లపాలెం: ద్వారకానగర్లోని హాస్టళ్లలో జరిగిన సెల్ఫోన్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏడీసీపీ మోహనరావు తెలిపారు. ద్వారకా పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకానగర్లోని శ్రీ చక్ర బాయ్స్ హాస్టల్ను కొవ్వూరి సోమిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7న ఆ హాస్టల్లో ఉంటున్న గణేష్ అనే విద్యార్థి తన ఫోన్ కనిపించడం లేదని సోమిరెడ్డికి తెలిపాడు. దీంతో ఆయన హాస్టల్లో విచారించగా.. హాస్టల్లో మొత్తం ఆరు ఫోన్లు, అదే ప్రాంగణంలోని మరో హాస్టల్లో ఐదు ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో సోమిరెడ్డి ద్వారకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితుడు కనకం దామోదర్గా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మే 27న అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. కనకం దామోదర్పై గతంలో కూడా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 20 సెల్ఫోన్ దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని ఏడీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధరరావు, ఎస్ఐ ఎస్.రాజు, సిబ్బంది వి.అప్పలరాజు, ఎస్.హరిప్రసాద్ (ఎంవీపీ క్రైం), ఎన్.జగత్కిరణ్(ఎంవీపీ క్రైం)లను ఏడీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మణరావు పాల్గొన్నారు.