
● ఫ్లై ఓవర్పై ఘోర ప్రమాదం ● ఇద్దరు యువకుల దుర్మరణం
అల్లిపురం: అతివేగం ఇద్దరు యువకుల ఆయువు తీసింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి తెలుగుతల్లి ఫ్లైఓవర్పై గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. టూటౌన్ సీఐ ఎం.శ్రీను, ఎస్ఐ కె.శ్రీలక్ష్మి తెలిపిన వివరాలివి. గోపాలపట్నం సమీపంలోని నరసింహనగర్కు చెందిన ఎస్.ప్రసన్నకుమార్, అతని స్నేహితుడు సాయి కిరణ్ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఎలక్ట్రిక్ స్కూటర్పై వైఎంసీఏ ఎదురుగా బీచ్కు వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా రైల్వేస్టేషన్ వైపు ప్రయాణిస్తుండగా.. డీఆర్ఎం కార్యాలయం సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది. అతివేగంగా ఉండటం వల్ల వాహనాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో వారు మధ్య డివైడర్పై ఉన్న పూలకుండీని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రసన్నకుమార్, సాయి కిరణ్లు ఒకరు డివైడర్పై, మరొకరు రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ట్రాఫిక్ సీఐ ఎం.శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అప్పటికే మృతి చెందిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రసన్నకుమార్ తండ్రి ఎస్.వెంకట అప్పలరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నరసింహనగర్లో తీవ్ర విషాదాన్ని నింపింది.