● వాస్తవానికి మైనింగ్ వ్యవహారంలో కూటమి నేతల మధ్యనే వివాదాలు రాజుకుంటున్నాయి. ఇష్టారీతిలో సాగుతున్న మైనింగ్ వ్యవహారంపై కూటమి పార్టీలోని నేతలే ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడింది.
● చోడవరం నియోజకవర్గంలో లక్కవరం, గవరవరం, శేమునాపల్లి, వెంకన్నపాలెం, నరసాపురం, జుత్తాడ, భోగాపురం వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా మైనింగ్ దందా జరుగుతోందని స్వయంగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు తహసీల్దారుతో పాటు విశాఖలోని విజిలెన్స్ ఎస్పీకి కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. శారదా నదిలోని ఇసుకను ఏ విధంగా ఇష్టారీతిలో తవ్వేస్తున్నారో కూడా ఫొటోలతో సహా వివరించారు. ఫిర్యాదుల పరంపర వారం రోజులుగా సాగుతున్నా.. చడీచప్పుడు లేకుండా పోయింది.
● పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి, సబ్బవరం మండలాల్లో సాగుతున్న గ్రావెల్ దందాపై కూడా కూటమి పార్టీలోని నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు.
● భీమిలిలోనూ అదే పరిస్థితి ఉంది. కూటమి పార్టీల పేరుతో కబ్జాల ఘనుడు చేస్తున్న వ్యవహారంతో పాటు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలపై కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదు.
● అనకాపల్లి జిల్లాలో కూడా నేరుగా అనుమతి లేని లారీలు పదుల సంఖ్యలో తిరుగుతున్నాయంటూ స్వయంగా ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎలా తిరగనిస్తున్నారని నిలదీశారు. అయినప్పటికీ రెండు, మూడు రోజులు నిలిచిన వ్యవహారం ఇప్పుడు యథావిథిగా సాగుతూనే ఉంది.
● యలమంచిలి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలపై టీడీపీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు నేరుగా ధ్వజమెత్తుతున్నారు. రాంబిల్లి వద్ద నిర్మిస్తున్న నేవల్ బేస్కు బండరాళ్ల తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని.. అధిక లోడుతో అనేక వాహనాలు వస్తున్నాయని అక్కడి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యే భారీగా వాటాలు తీసుకుంటున్నారని కూడా పరోక్షంగా ధ్వజమెత్తుతున్నారు.
● ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమిలోని ఒక పార్టీ చేస్తున్న మైనింగ్ దందాను మరో పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదంటే కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.