
ఆటోలో మరిచిపోయిన రూ.1.2 లక్షలు
మర్రిపాలెం: తమ కుమారుడి శస్త్రచికిత్స కోసం తీసుకెళ్తున్న రూ.1.20 లక్షలను రాజాబాబు అనే వ్యక్తి ఆటోలో మరిచిపోయారు. కొంతసేపటికి అతను తన పొరపాటును గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు అప్రమత్తమై ఆటోలో నగదుతో ఉన్న బ్యాగును గుర్తించి బాధితుడికి అప్పగించారు. వివరాలివి.. మర్రిపాలెంలో ఉంటున్న రాజాబాబు తన కుమారుడితో కలిసి బుధవారం ఇంటి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మర్రిపాలెం మెయిన్రోడ్డులో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జ్ఞానాపురం రైల్వేస్టేషన్కు వెళ్లడానికి ఆటో ఎక్కారు. హడావుడిలో తన వద్ద ఉన్న రూ.1.20 లక్షల నగదు, ఆపరేషన్కు సంబంధించిన పత్రాలు, దుస్తులు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. ఆ తర్వాత స్టేషన్ వద్ద దిగిపోయారు. కొంత సమయం తర్వాత తన పొరపాటును గ్రహించిన రాజాబాబు వెంటనే 112కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపారు. అక్కడే డ్యూటీలో ఉన్న కంచరపాలెం క్రైం ఎస్ఐ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆ ప్రాంతంలోని అన్ని ఆటోలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఒక ఆటో వెనుక సీటులో బ్యాగును గుర్తించారు. డ్రైవర్కు కూడా ఆ బ్యాగు తన ఆటోలో ఉందనే విషయం తెలియదు. పోలీసులు నగదుతో ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకుని.. రాజాబాబుకు అప్పగించారు. తన బ్యాగును త్వరగా గుర్తించి, డబ్బులను సురక్షితంగా అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
బాధితుడికి అప్పగించిన పోలీసులు