
పబ్జిగేమ్ ఆడొద్దన్నందుకు మనస్తాపంతో..
● ఇంటి నుంచి పారిపోయిన విద్యార్థి ● టూటౌన్ పోలీసులకు చిక్కిన యువకుడు ● కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
అల్లిపురం: పబ్జీ గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించడంతో ఓ యువకుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా..ఉంగుటూరుకు చెందిన ఐటీఐ విద్యార్థి.. పబ్జీ గేమ్స్కు బానిస కావడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి వెంప శివకుమార్ ఏలూరు పరిసర ప్రాంతాలలో వెతికినా అతని ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఆయన నిడమర్రు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సదరు విద్యార్థి ఒక వ్యక్తి సెల్ నుంచి తాను హైదరాబాద్లో ఉన్నట్లు తండ్రి సెల్కు మెసేజ్ పెట్టాడు. ఆ ఫోన్ నంబరు ఆధారంగా నిడమర్రు పోలీసులు సాంకేతికత ద్వారా విద్యార్థి విశాఖలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో విశాఖ చేరుకున్న తల్లిదండ్రులు టూటౌన్ పోలీసులను సంప్రదించారు. ఎస్.ఐ ఎన్. సింహాచలం, హెచ్సీ టీ. శ్రీనివాసరాజు సహకారంతో గాలించగా సదరు విద్యార్థి కల్లుపాకల వద్ద ఉన్నట్లు గుర్తించారు. అతడిని తీసుకువచ్చి సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.