నెత్తుటి ధారలు | - | Sakshi
Sakshi News home page

నెత్తుటి ధారలు

May 9 2025 12:48 AM | Updated on May 9 2025 12:48 AM

నెత్తుటి ధారలు

నెత్తుటి ధారలు

విశాఖపై
నాలుగు నెలల్లో తొమ్మిది హత్యలు వీరిలో ఏడుగురు మహిళలే.. సిటీ ఆఫ్‌ డెస్టినీ కాస్తా.. సిటీ ఆఫ్‌ క్రైమ్‌గా రూపాంతరం? కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు

ఈ ఏడాదిలో

వరుస ఘటనలు

● మే 2న దాకమర్రి ఫార్చ్యూన్‌ లేఅవుట్‌లో మహిళను హత్య చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ప్రియుడు.

● ఏప్రిల్‌ 26న దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాజీవ్‌నగర్‌కు చెందిన దంపతులు యోగేంద్రబాబు(65) లక్ష్మి(52)లను డబ్బు కోసం హత్య చేసిన దుండగుడు.

● ఏప్రిల్‌ 14న మధురవాడలో నిండు గర్భిణి అనూషను హత్య చేసిన భర్త జ్ఞానేశ్వర్‌. 24 గంటల్లో డెలివరీ అవ్వాల్సి ఉండగా చంపడంతో ఆమె గర్భంలో ఉన్న ఆడ శిశువు కూడా కన్నుమూసింది.

● ఏప్రిల్‌ 2న కొమ్మాదిలోని వికలాంగుల కాలనీలో ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు. తల్లి అక్కడికక్కడే మృతి చెందింది.

● ఫిబ్రవరి 21న పూజల పేరుతో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడు అప్పన్నను ఆమె భర్త చిన్నారావు బోయపాలెం–కాపులుప్పాడ మార్గంలో కల్లివానిపాలెం గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో కత్తితో పొడిచి హత్య చేశాడు. మరుసటి రోజు వచ్చి పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు.

● జనవరి 1న మల్కాపురంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దని వారించిన తల్లిని కొట్టి చంపిన కుమారుడు.

విశాఖ సిటీ: ఒక్క రోజులో డెలివరీ కాబోయే భార్యను అత్యంత పాశవికంగా గొంతు నులిమి చంపేసిన భర్త.. వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి డబ్బు, మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయిన హంతకుడు.. పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు.. ఇలా వరుస హత్యలతో విశాఖలో రుధిర ధారలు పారుతున్నాయి. నగరంలో నెత్తుటి మరకలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఇప్పుడు సిటీ ఆఫ్‌ క్రైమ్‌గా మారిపోయింది. ఇందుకు ఇటీవల వరుసగా జరుగుతున్న హత్యలే నిదర్శనం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 9 హత్యలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఏడుగురు మహిళలే బలవడం బాధాకరం. ప్రేమ.. పెళ్లి.. వివాహేతర సంబంధం.. డబ్బు.. ఇలా కారణమేదైనా అవి హత్యలకు దారితీస్తున్నాయి. ప్రశాంత విశాఖను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

మహిళలకు రక్షణ కరువు

‘మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఆడ పిల్లల రక్షణపై వెనకడుగు వేసేది లేదు. మహిళల భద్రత తమ తొలి ప్రాధాన్యత’ అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ ప్రచార ఆర్బాటాలకే తప్ప, మహిళలపై అకృత్యాలను అడ్డుకోలేకపోతున్నారు. విశాఖలో పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. అకృత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన వరుస ఘటనల్లో ఏడుగురు మహిళలే హత్యకు గురవడం కూటమి ప్రభుత్వంలో పరిస్థితికి అద్దం పడుతోంది. బాలికలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నగరంలో వరుస హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప.. వాటిని అరికట్టే చర్యలకు ఉపక్రమించడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వంలో విశాఖ ఆర్థిక రాజధానిగా కాకుండా నేర రాజధానిగా మారుతోందన్న భావన కలుగుతోంది.

వరుస హత్యలతో కలవరం

విశాఖకు ప్రశాంత నగరంగా పేరుంది. దేశంలో ఎక్కడ ఉద్యోగం, వ్యాపారం చేసినా.. చివరకు విశాఖలో స్థిరపడాలని కోరుకుంటారు. అలాంటి నగరంలో వరుస హత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఘటనలతో విశాఖ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెదగదిలిలో ఐదు నెలల కుమార్తెను కన్న తల్లే హత్య చేసింది. అలాగే పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలిని.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దని వారించిన తల్లిని.. పూజల పేరుతో వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడిని.. వివాహేతర సంబంధాన్ని వదిలించుకోవాలని ప్రియురాలిని.. ఇలా అనేక కారణాలతో విశాఖలో హత్యలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement